ఎన్టీఆర్ కుమార్తె పోస్టుమార్టం నివేదిక
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి(57) మృతి కేసులో ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు. ఈ నెల ఒకటో తేదీన ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె భౌతికకాయానికి వైద్యులు పంచనామా నిర్వహించారు. మెడ చుట్టూ తాడు గట్టిగా బిగించుకోవడం వల్ల స్వరపేటిక విరిగి ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.