YouSay Short News App

IND vs SL: మూడో వన్డేలో భారత్ రికార్డు విజయం

మూడో వన్డేలో శ్రీలంకపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ని  3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా 317 పరుగుల తేడాతో గెలుపొందింది. వన్డేల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గతంలో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 రన్స్ తేడాతో గెలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అదరగొట్టింది. కోహ్లీ(166*), గిల్(113) సెంచరీలతో చెలరేగడంతో భారత్ 390 పరుగుల భారీ స్కోరు చేసింది.

390 పరుగుల లక్ష్యాన్ని చూడగానే శ్రీలంక మానసికంగా ఓడిపోయింది. మైదానంలో దాన్ని రుజువు చేస్తూ 73 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో సిరాజ్(4/32) లంక బ్యాటర్ల పని పట్టాడు. షమి(2/20), కుల్‌దీప్ యాదవ్(2/16) ప్రదర్శనతో టీమిండియాకు చెరగని విజయాన్ని అందించారు.

వన్డేల్లో శ్రీలంకపై 300కు పైగా స్కోరు నమోదు చేయడం భారత్‌కు ఇది 23వ సారి. ఇలా ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 300+ పరుగులు చేసిన జట్ల జాబితాలో టీమిండియాది 2వ స్థానం. ఆస్ట్రేలియా(28vs ఇండియా) తొలిస్థానంలో ఉంది.

మూడో వన్డే ప్రదర్శన అనంతరం కోహ్లీ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

259 ఇన్నింగ్సుల్లో కోహ్లీ 12,754 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ ప్లేయర్ జయవర్దనె(418 ఇన్నింగ్సుల్లో 12,650 రన్స్)ను అధిగమించి 5వ స్థానంలో నిలిచాడు.

సచిన్ రికార్డులను విరాట్ బ్రేక్ చేశాడు. వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు చేసి విరాట్(21) సచిన్‌(20)ని అధిగమించాడు. ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసి కూడా కోహ్లీ(10vs శ్రీలంక) మాస్టర్ బ్లాస్టర్(9vs ఆస్ట్రేలియా)ని దాటేశాడు.

‘‘మైలురాళ్లు చేరుకోవాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆడను. మైదానంలో ఆటను ఆస్వాదిస్తా. ప్రశాంతంగా ఆడుతూ ఎంజాయ్ చేస్తా’’- విరాట్ కోహ్లీ

స్కోర్లు: భారత్ 390/5 (50); శ్రీలంక 73 ఆలౌట్ (22) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్: విరాట్ కోహ్లీ