Maha Shivaratri:  12 రూపాల్లో శివయ్య..  ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్ఠత తెలుసా?

YouSay Short News App

శివుడికి ఎన్నో రూపాలు. మరెన్నో పేర్లు. ఎక్కువగా లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. అందుకే శివుడిని మన దేశంలో అధికంగా ఆరాధిస్తారు.

శివయ్యకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందినవి. దేశంలో 12 చోట్ల ఈ ఆలయాలు విస్తరించి ఉన్నాయి. శైవులు ఒక్కసారైనా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చెబుతుంటారు.

1. మల్లికార్జున జ్యోతిర్లింగం

కృష్ణా నది ఒడ్డున శ్రీశైలం పర్వతంపై కొలువు దీరిన శివయ్య రూపమే ‘మల్లికార్జున జ్యోతిర్లింగం’. మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉంది.

ఆలయ విశిష్టత

శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిగిన అరుదైన క్షేత్రాల్లో ఇదొకటి. రాక్షసుడిని భ్రమర(తుమ్మెద)ల ద్వారా హరించినందువల్ల భ్రమరాంభ అనే పేరొచ్చింది. శ్రీ అనగా సంపద, శైలం అంటే పర్వతం. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చు.

2. సోమ్‌నాథ్ జ్యోతిర్లింగం

గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఈ జ్యోతిర్లింగం ప్రతిష్ఠితమై ఉంది.  సోమ్‌నాథ్ ఆలయం పలుమార్లు విదేశీ దండయాత్రల్లో దెబ్బతింది.

ఆలయ విశిష్టత

శాపగ్రస్తుడైన చంద్రుడి ఇక్కడి సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించాడట. సోమేశ్వరుడిగా ఉన్న శివుడిని ఆరాధించడంతో చంద్రుడు విముక్తుడయ్యాడని పురాణం చెబుతోంది.

3.మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

12 జ్యోతిర్లింగాలలో దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక లింగం ఇది. మధ్యప్రదేశ్‌లోని చారిత్రాత్మకమైన ఉజ్జయిని ప్రాంతంలో ఆలయం ఉంది.

ఆలయ విశిష్టత

మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి చాలా పురాణ కథలు ఉన్నాయి. ఉజ్జయిని రాజు చంద్రసేన తన రాజ్యాన్ని కాపాడాలని శివుడిని వేడుకోగా మహాకాళి రూపంలో వచ్చి శత్రుసంహారం చేసినట్లుగా ప్రతీతి.

4. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా ఓమేశ్వర్ అనే చిన్న పట్టణంలో ఓంకారేశ్వర్‌గా శివుడు కొలువై ఉన్నాడు. నర్మదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. రైలు, విమానంలో వెళ్లవచ్చు.

ఆలయ విశిష్టత

చుట్టూ ఉన్న పర్వాతాలు, నదుల వల్ల ఓంకారం సిద్ధించింది. మాన్‌ధాత పర్వతం ‘ఓం’ ఆకారంలో ఉండటం వల్ల ఈ జ్యోతిర్లాంగానికి ఓంకారేశ్వర్ అనే పేరు వచ్చింది.

5. కేదరినాథ్ జ్యోతిర్లింగం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైన జ్యోతిర్లింగం ఇది. 3,584 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్ పర్వతాలపై ఈ ఆలయం ఉంటుంది.

ఆలయ విశిష్టత

ఏటా 6 నెలలు మాత్రమే గుడి తెరిచి ఉంటుంది. గౌరికుండ్ వరకు వాహనంలో వెళ్లొచ్చు. ఆపై కాలినడకన ఆలయానికి చేరుకోవాలి.

6. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథుడిగా భక్తులకు శివయ్య దర్శనమిస్తున్నాడు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. రైలు, విమానం ద్వారా చేరుకోవచ్చు.

ఆలయ విశిష్టత

దేవుడే స్వయంగా ఇక్కడ ఉండాలని భావించి ఈ నగరాన్ని నిర్మింపజేశాడని ప్రసిద్ధి. ఈ నగరాన్ని చూసి పార్వతీ దేవీ ఎంతో సంతోషించిందట. అనంతరం అందరికీ ఆహారాన్ని దానం చేసింది. అందుకే అన్నపూర్ణగా పేరొచ్చింది.

7. రామేశ్వర జ్యోతిర్లింగం

శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగమే ‘రామేశ్వర జ్యోతిర్లింగం’. తమిళనాడులోని రామనాథం ప్రదేశంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ట్రైన్ ద్వారా నేరుగా రామేశ్వరం చేరుకోవచ్చు.

ఆలయ విశిష్టత

లంకాధిపతి రావణాసురిడిని ఓడించాక పాప విముక్తి కోసం రాముడు శివుడిని ఆరాధించాడు.  ఈ మేరకు స్వయంగా లింగాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశాడు.

8. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం

గోదావరి నది జన్మించిన ప్రాంతానికి సమీపంలో ఉంటుందీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. బ్రహ్మగిరి పర్వతానికి సమీపాన ఉంటుంది.

ఆలయ విశిష్టత

త్రిమూర్తులు ఇక్కడ కొలువై ఉన్న జ్యోతిర్లింగం ఇది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఇక్కడ వెలిశారు. నాసిక్ వరకు ట్రైన్‌లో వెళ్లి ప్రైవేటు వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

9. బైద్యనాథ్ జ్యోతిర్లింగం

జార్ఖండ్‌లోని సంతాల్ పరగణా ఢియోగర్‌లో ఉంటుందీ జ్యోతిర్లింగం. చితాభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లింగం భూమి లోపల ఉంటుంది.

సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ద్వారా జల్‌సిధి జంక్షన్ వరకు వెళ్లొచ్చు. రాంచి ఎయిర్‌పోర్టులో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా కూడా చేరుకోవచ్చు.

10. భీమశంకర్ జ్యోతిర్లింగం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో సహ్యాద్రి పర్వతాలపై భీమశంకర్ రూపంలో శివుడు ఆసీనులయ్యాడు. ఇక్కడికి చేరుకోవాలంటే దట్టమైన పర్వతాల మధ్య నుంచి వంపులు తిరిగిన రోడ్డుపై ప్రయాణించాలి.

ఆలయ విశిష్టత

ముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలిగించి నందువల్ల భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడికి పుణే నుంచి బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది.

11. నాగేశ్వర్ జ్యోతిర్లింగం

గుజరాత్‌లో కొలువైన మరో జ్యోతిర్లింగం ఇది. బరోడా ప్రాంతంలో ఉంటుంది. ద్వారకా రైల్వే స్టేషన్ నుంచి 15కి.మీ దూరంలో ఉంటుంది.

ఆలయ విశిష్టత

ఇక్కడి పురాణాల ప్రకారం శివుడిని పాములకు దేవుడిగా భావిస్తారు. 25 మీటర్ల ఎత్తైన శివుడి విగ్రహంతో పాటు చెరువుతో కూడిన పెద్ద తోట ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

12. ఘృష్నేశ్వర్ జ్యోతిర్లింగం

మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లాలో ఈ  జ్యోతిర్లింగం ఉంది. ప్రముఖ ఎల్లోరా గుహలు ఉన్న జిల్లా కూడా ఇదే. ఎల్లోరా వరకు ట్రైన్‌లో చేరుకోవచ్చు. ఆపై రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలి.

ఆలయ విశిష్టత

హిందూ పురాణాల ప్రకారం ఈశ్వరుడికి అంకితం చేసిన జ్యోతిర్లింగాలలో ఇదొకటి. ఘుష్మ అనే శివభక్తురాలి కోరిన వరం మేరకు శివుడి ఇక్కడ వెలిశాడని ప్రసిద్ధి.