సంచలనాలకు మారుపేరుగా మారిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) జాతీయ స్థాయిలో మరోమారు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) – 2024 అవార్డు కైవసం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ అవార్డు వేడుకల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో సందీప్ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాడు. ‘యానిమల్’ (Animal) చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. అటు ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్తో అదరగొట్టిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకుంది.
నెట్టింట సందీప్ మేనియా
ప్రతిష్టాత్మక DPIFF అవార్డు అందుకోవడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు నెట్టింట మారుమోగుతోంది. #SandeepReddyVanga హ్యాష్ట్యాగ్తో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చాయి. ప్రధానంగా దాదా సాహేబ్ అవార్డు అందుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు, సందీప్ రెడ్డి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.
‘నన్ను ఆపితే హాలీవుడ్కు వెళ్తా’
సందీప్ రెడ్డి వంగాకు తనపైన తనకు నమ్మకం ఎక్కువ. ఆ విశ్వాసం వల్లే యూనిక్ కాన్సెప్ట్లతో సినిమాలు తీయగల్గుతున్నారు. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే సందీప్లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై అప్పట్లో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సందీప్ వద్ద లేవనెత్తగా.. అందుకు సందీప్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏంటో కింద వీడియోలో చూడండి.
సందీప్ ఫేవరేట్ స్టార్లు వారే!
సందీప్ రెడ్డి వంగా.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్లను ఉద్దేశించి సందీప్ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో తాను చిరు, పవన్లకు పెద్ద ఫ్యాన్ అని సందీప్ చెబుతాడు. తన గురించి కొంత సమాచారం తెలిసిన వారికైనా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంటాడు. చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ కాంపీటిషన్ పెడితే తాను ఫస్ట్ వస్తానని ఓ అవార్డు వేడుకలో సైతం సందీప్ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
ఓ వైపు విమర్శలు.. మరోవైపు అవార్డులు
గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్ఫ్లిక్స్లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలవడం విశేషం. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం విశేషం.
సందీప్పై హీరోయిన్ సెటైర్!
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దాదా సాహేబ్ అవార్డు రావడంతో హీరోయిన్ పూనమ్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం ‘యానిమల్స్’ మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి ఫ్యాన్స్ పూనం పోస్టును తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను ఆపలేరని కామెంట్స్ చేస్తున్నారు.
మిగతా అవార్డులు..
ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ విలన్ అవార్డు కూడా యానిమల్ చిత్రానికే వరించడం విశేషం. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (ANIMAL) అవార్డు అందుకున్నారు. అటు క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ (సామ్ బహదూర్), ఉత్తమ గీత రచయితగా జావేద్ అక్తర్ (నిక్లే ది కభి హమ్ ఘర్సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)గా వరుణ్ జైన్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డు ఏసుదాసుకి, ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి.
టీవీ విభాగంలో..
అటు టెలివిజన్ విభాగంలో దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుల విషయానిసి వస్తే.. టెలివిజన్ సిరీస్ ఆఫ్ది ఇయర్గా ‘ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మెయిన్), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్సిరీస్ విభాగంలో క్రిటిక్స్ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్) నిలిచారు.