అసలు రాజాసింగ్ ఎవరు? వివాదాలకు బీజం ఎక్కడ?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసలు రాజాసింగ్ ఎవరు? వివాదాలకు బీజం ఎక్కడ?

    అసలు రాజాసింగ్ ఎవరు? వివాదాలకు బీజం ఎక్కడ?

    August 25, 2022

    © ANI Photo

    మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ పార్టీ నుంచి సస్పెండైన రాజాసింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.  మొదటి నుంచి దుందుడుకు శైలీ కలిగిన రాజసింగ్ అసలు పేరు టీ. రాజాసింగ్ లోథ్. రాజాసింగ్ పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. రాజా సింగ్‌కు ఉషాభాయితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తే ఉన్నారు.

    రాజకీయ జీవితం

    రాజాసింగ్ తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009-2014 వరకు కార్పోరేటర్‌గా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

    వివాదాలు

    2018లో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై 50 తీవ్రమైన నేర అభియోగాలు ఉన్నట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. వీటిలో హత్యప్రయత్నం కేసు కూడా ఉంది.  తన నియోజకవర్గంలో గోసంరక్షుడిగా పేరు తెచ్చుకున్న రాజా సింగ్.. పెద్దసంఖ్యలో గోవులను రక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫేస్టివల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాడు. 2020 డిసెంబర్‌లో ఓ వర్గం మత విశ్వాసాలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఫేస్‌బుక్ ఆయన వ్యక్తిగత ఖాతాతో పాటు ఇన్‌స్టాగ్రాం ఖాతాపై నిషేధం విధించింది.

    మునావర్ సింగ్ షో- ఉద్రిక్తతల కేంద్రం

    ఆగస్టు 19న హైదరాబాద్- హైటెక్స్‌లో స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ షో నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాజాసింగ్‌. హిందూ దేవుళ్లను కించపరిచేలా మునావర్ షోలు ఉంటాయనీ, అతని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌ను ముందస్తు అరెస్ట్ చేశారు. ఫలితంగా మునావర్ షో పోలీసుల భద్రత మధ్య కొనసాగింది.

    దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజాసింగ్ మతపరంగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వాటిపై అర్ధరాత్రి నుంచి పాతబస్తీలో ఆందోళనలు కొనసాగాయి. దేశ వ్యాప్తంగానూ ఆందోళనలు చెలరేగాయి. రాజాసింగ్‌పై తెలంగాణతో పాటు దేశంలో మరికొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. పోలీసుల సూచనలతో రాజాసింగ్‌ వీడియోను యూట్యూబ్ డిలీట్‌ చేసింది. దీనిపై స్పందించిన రాజాసింగ్ మునావర్ షోపై మళ్లీ విమర్శలు చేశారు. రెండో వీడియోను కూడా విడుదల చేస్తానని ప్రకటించారు. అప్పటికే ఆయన విడుదల చేసిన మొదటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    రాజాసింగ్ అరెస్ట్- విడుదల- అరెస్ట్

    రాజాసింగ్‌పై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయన్ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం పోలీసులు నాంపల్లి కోర్టు ఎదుట హాజరు పరిచారు.  విచారణ చేపట్టిన న్యాయస్థానం తొలుత 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత రాజాసింగ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్ట్ చేసే ముందు  41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వలేదన్న రాజాసింగ్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది.  ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని రాజాసింగ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు రాజాసింగ్‌కు గురువారం షాహినాయత్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రెచ్చగొట్టే పాటలు పెట్టారని ఆయనపై నమోదైన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈమేరకు గురువారం మధ్యాహ్నం ఉద్రిక్తతల నడుమ రాజాసింగ్‌ను మళ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

    రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు

    ఓ వర్గం విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై బీజేపీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది. ఆగస్టు 23న రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  శాసనసభ పక్షనేత పదవి నుంచి తొలగించింది. సెప్టెంబర్ 2లోగా తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

    హైదరాబాద్‌లో హై టెన్షన్

    రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి.రాజా సింగ్ వ్యాఖ్యలకు నిరసనగా  బుధవారం  ఓ వర్గం యువతపెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లు రువ్వింది. పోలీసుల వాహనాన్ని  ధ్వంసం చేసింది. దీంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. హైదరాబాద్‌లో అలజడులకు అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతో పోలీసు శాఖ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. బుధవారం రాత్రి 7 గంటలలోపు షాపులన్నీ బంద్‌ చేయాలని స్పష్టం చేసింది. ర్యాపిడ్‌ యాక్షన్ ఫోర్స్.. ఆందోళనలు జరిగే ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించింది.  హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్, హోంమంత్రి మహ్మద్ అలీ సమీక్షచేపట్టారు. అల్లర్లకు పాల్పడినా, విద్వేశ పూరిత వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పాతబస్తీలోని స్కూళ్లకు ఆయా యాజమాన్యాలు.. ఈనెల 25, 26న  స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version