పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సలార్’ (Salaar). గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. సలార్ పార్ట్ 2; శౌర్యంగ పర్వం (Salaar Part 2 ; Shouryaanga Parvam) పేరుతో ఇది రూపొందనుంది. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో మరో చిత్రం ఉండనున్నట్లు క్రేజీ బజ్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సినిమా టైటిల్ అదే!
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న ఈ హ్యాట్రిక్ మూవీకి టైటిల్ ఇదే అంటూ ఓ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘రావణం’ (Ravanam) అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే అతిపెద్ద చిత్రంగా ఇది రూపొందనున్నట్లు సమాచారం. భారత సినిమా చరిత్రలో ఇంతవరకూ రాని కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బాహుబలి తరహాలోనే..!
బాహుబలి తరహాలోనే ఈ సినిమాకు కూడా మైథలాజికల్ డ్రామా (Mythological Drama)గా రానుందని అంటున్నారు. ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ జోనర్ సినిమాను ఇప్పటి వరకూ చేయలేదు. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ నటించినప్పటికీ అది రామాయణం ఆధారంగా తెరకెక్కింది. దీంతో కమర్షియల్గా రానున్న ‘రావణం’ ప్రభాస్ ఫేమ్, కెరీర్ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కథకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ మైథలాజికల్గా వస్తుందన్న ఊహాగానాలతో ‘రావణం’ ఆసక్తిరేపుతోంది.
నిర్మాత అతడే!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను రూపొందిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తారని అంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు.. రామ్చరణ్తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. దిల్రాజు ఫోకస్ మెుత్తం ప్రస్తుతం ఆ సినిమా పైనే ఉంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఆయన ‘రావణం’ మేకింగ్ వర్క్స్పై దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షూటింగ్ ఎప్పుడు?
‘రావణం’ సినిమా షూటింగ్కు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ‘సలార్ 2’ తర్వాత వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని కొందరు అంటున్నారు. గతంలో తారక్ (Jr NTR)తో ప్రశాంత్ నీల్ ఓ సినిమాను ప్రకటించారు. ‘NTR 31’గా అది రావాల్సి ఉంది. అయితే తాజా బజ్ ప్రకారం ఆ మూవీ కంటే ముందే ‘రావణం’ తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరికొందరి విశ్లేషణ మరోలా ఉంది. 2026 తర్వాత ప్రశాంత్ నీల్ ‘రావణం’ ప్రాజెక్ట్ను టేకప్ చేయవచ్చని అంటున్నారు. అప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లోనే ‘రావణం’పై క్లారిటీ రానుంది.