పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాడు.
మనల్ని ఎవడ్రా ఆపేది
గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.
‘ఉస్తాద్ భగత్సింగ్’ లుక్ టెస్టు
ఉస్తాద్ భగత్సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది.
వరుస పెట్టి సినిమాలు
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్ శంకర్ షూటింగ్ను మార్చి 28నుంచి పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.
ఫటా ఫట్
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్కి ఇవి పండగనే చెప్పాలి.
పవన్ క్యూ
జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
ఎన్నికలకు వేళాయే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.