గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు కలెక్షన్లు కష్టమంటూ అవహేళనలు ఎదుర్కొన్న టాలీవుడ్ వెయ్యి కోట్ల మార్క్ను సైతం అవలీలగా చేరుకుని ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఒక్కో ఏడాది ఒక్కో మార్క్ను దాటుకుంటూ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అందులో టాప్-10 చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సలార్ (Salaar)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్’, క్రిస్మస్ కానుకగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్ల షేర్ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లతో సలార్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
యానిమల్ (Animal)
అర్జున్రెడ్డి ఫేమ్ సందీప్రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్వైడ్గా ఇప్పటివరకూ రూ.869 కోట్లను వసూలు చేసింది.
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)
ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల్లో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.219 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క తెలుగులోనే రూ.159.68 నెట్ వసూళ్లను సాధించింది.
ఆదిపురుష్ (Adipurush)
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లను వసూలు చేసింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.133.28 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత అనేక వివాదాలను మూటగట్టుకుంది.
వీరసింహా రెడ్డి (Veera Simha Reddy)
బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రూ.130కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.97.64 కోట్ల వసూళ్లను రాబట్టింది.
భగవంత్ కేసరి (Bhagavanth Kesari)
అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.114.5 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.84.78 కోట్లు రాబట్టింది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది.
బ్రో (Bro)
పవర్స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు రాబట్టింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.82.68 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఈ చిత్రంలోని నటుడు పృథ్వీ పాత్ర ఏపీలో రాజకీయ వివాదానికి కారణమైంది.
దసర (Dasara)
నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.118.5 వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో రూ.75.81 వసూళ్లను రాబట్టింది. నాని కెరీర్లో రూ.100 కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా దసరా నిలిచింది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.
బేబీ (Baby)
చిన్న సినిమాగా వచ్చిన ‘బేబీ’.. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. యూత్ను విపరీతంగా ఆకర్షించి వరల్డ్వైడ్గా రూ.81.05 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 64.12 కోట్లు వసూలు చేయడం విశేషం.