2021లో వచ్చిన పుష్ప చిత్రం (Pushpa) ఏ మేర ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అన్న డైలాగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు సైతం పోస్టు చేశారు. దీంతో ఈ సినిమా మరింతగా సినీ ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ క్రేజే అల్లుఅర్జున్ (Allu arjun)కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో బన్నీ తన విశ్వరూపాన్ని చూపించాడు. నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ ఇలా ప్రతీదానిలో తన మార్క్ చూపించి భారత సినీ ప్రేక్షకులను హోరెత్తించాడు. జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించిన పుష్ప సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
పదేళ్ల తర్వాత..
2004లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం బన్నీ కెరీర్లో ఓ మైలురాయి వంటింది. సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం కూడా అదే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య2’ యావరేజ్గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్, సుకుమార్ చేతులు కలిపారు. తాజాగా దీనికి జాతీయ అవార్డు రావడంతో ఈ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాలు చేసుకున్నారు.
ఛాన్స్ మిస్ చేసుకున్న మహేశ్..!
‘పుష్ప’ కథను సుకుమార్ తొలుత మహేశ్బాబుకు చెప్పారట. ఆయనకు కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. కానీ, అప్పటికే ఒప్పుకొన్న ప్రాజెక్టుల వల్ల మహేష్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాడట. దీంతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే మహేశ్కు చెప్పిన కథ ఇదే నేపథ్యమైనప్పటికీ స్టోరీ లైన్ వేరని సుకుమార్ ఆ తర్వాత తెలిపారు. ఇదిలా ఉంటే పుష్పరాజ్ పాత్రకు బన్నీ ప్రాణం పోశాడు. ఈ పాత్ర కోసం రెండు, మూడు గంటలు కదలకుండా మేకప్ వేసుకున్నాడు. ఆ కృషే పుష్పకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.
మ్యాజిక్ రిపీట్
అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురూ కలిస్తే ఆడియన్స్కు పూనకాలే అని ఇంతకు ముందు సినిమాల ద్వారా నిరూపతమైంది. ‘పుష్ప’ విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అయింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్-10 సాంగ్స్లో ఇవి నిలిచాయి. అంతేకాదు 6.2 బిలియన్కు పైగా వ్యూస్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్గానూ రికార్డు సృష్టించాయి. ఈ పాటలకు గాను దేవిశ్రీ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోనున్నారు.
కలెక్షన్ల సునామీ
2021 డిసెంబరు 17న ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు (గ్రాస్) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్ రికార్డు సృష్టించాడు.
ఓటీటీలోనూ ప్రభంజనమే
ఓటీటీలోనూ ‘పుష్ప’అదరగొట్టింది. 2022లో అమెజాన్ప్రైమ్లో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్లోనూ పుష్పరాజ్ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది.
రికార్డుస్థాయిలో రీల్స్
సోషల్ మీడియాను సైతం ‘పుష్ప’ ఒక ఊపు ఊపింది. 10 మిలియన్లకు పైగా ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, సన్నివేశాలు నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి.
అవార్డ్స్లోనూ ‘తగ్గేదేలే’
గతంలో ఈ సినిమాకు ఏడు ఫిల్మ్ఫేర్లు, మరో ఏడు సైమా అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పుష్పరాజ్కు రావడం విశేషం.
ఫేమస్ డైలాగ్స్
పుష్ప సినిమాను ప్రజలకు మరింత చేరువ చేసిన అంశాల్లో డైలాగ్స్ ముందు వరుసలో ఉంటాయి.‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..’, ‘సరకు ఉంటే పుష్ప ఉండడు.. పుష్ప ఉంటే సరకు ఉండదు.. రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు’, ‘నేను ఇక్కడ బిజినెస్లో ఏలుపెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చా.. తగ్గేదేలే’ లాంటి డైలాగ్లు బాగా ఫేమస్ అయ్యాయి.
పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు!
‘పుష్ప’ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) రానుంది. దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ‘పుష్ప ఎక్కడా..?’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే ‘పుష్ప 2’ సంబంధించి అల్లు అర్జున్, రష్మిక (Rashmika), ఫహాద్ ఫాజిల్ల ఫస్ట్లుక్లను రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.