తెలంగాణలో నేటి నుంచి 5రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడనున్నట్లు అంచనా వేసింది. సోమవారం చాలా జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. వడగళ్ల దెబ్బకు పెద్దఎత్తున పంట నష్టం సంభవించింది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 6.7సెం.మీ, కరీంనగర్లో 5.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం కూడా జోరు వాన కురిసింది. ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వడగండ్లు రైతుల పాలిట శమపాశంగా మారాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా నాశనం కావటంతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి. గత మూడ్రోజుల నుంచి వరుసగా వర్షాలు పడుతుండటంతో కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్లో కుండపోత వాన కురిసింది. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దాదాపు గంటపాటు ఎడతెరపిలేకుండా వర్షం పడింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
బుధవారం కూడా వాతావరణం దాదాపు చల్లగా ఉంది. సూర్యుడి జాడ కనిపించడం లేదు. నిన్న మెున్నటి వరకు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడిన భాగ్యనగర వాసులకు కాస్త ఊరట లభించింది. కానీ, వర్షం బీభత్సం సృష్టించడంతో ఇప్పుడు వరద నీటితో అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.