Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?

    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?

    June 29, 2024

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. 

    వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం

    అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన ‘ఎదురులేని మనిషి’ చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం. 

    అగ్నిపర్వతం

    వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. 

    జగదేక వీరుడు అతిలోక సుందరి

    వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.  రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. 

    శుభలగ్నం

    జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’.

    గోవిందా గోవిందా

    నాగార్జున రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘గోవిందా గోవిందా‘.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’.

    ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌

    రాజకుమారుడు

    వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘రాజకుమారుడు‘ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. ‘సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?’ అన్నది కథ. 

    ఇంద్ర

    మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా ‘ఇంద్ర‘కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. ‘రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?’ అన్నది కథ.

    స్టూడెంట్‌ నెంబర్‌ 1

    దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం ‘స్టూడెంట్‌ నెం.1‘ అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. 

    మహర్షి

    మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి  చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ.

    ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌

    సీతారామం

    2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ.

    ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ & హాట్‌స్టార్‌

    కల్కి 2898 ఏడీ

    నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 

    వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు

    బాణం

    అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ.

    సారొచ్చారు

    ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌  రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ.

    ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ & ఆహా

    Sir Ocharu Movie Posters TollywoodAndhra.in

    ఎవడే సుబ్రహ్మణ్యం

    కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’.

    ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌

    మహానటి

    అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ. 

    ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌

    జాతి రత్నాలు

    వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన ‘స్వప్న సినిమా’.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ.

    ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version