‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి గ్లోబల్ స్థాయి సక్సెస్ తర్వాత మెగా పవర్స్టార్ రామ్చరణ్ (Ram Charan) చేస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). దిల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్ నుంచి చెప్పుకోతగ్గ అప్డేట్ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్.. ఈ కథను లీక్ చేయడం గమనార్హం.
కథ ఏంటంటే?
మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్కు రాబోయే సినిమాలు/ సిరీస్లకు సంబంధించిన స్టోరీ లైన్స్తో పాటు గేమ్ ఛేంజర్ ప్లాట్ను అమెజాన్ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్ తండ్రి కొడులుగా డ్యూయల్ రోల్స్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
వామ్మో ఏకంగా అన్ని కోట్లా!
‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ నిలవనుంది.
గ్రాండ్గా ఆరంభమైన ‘RC16’
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్చరణ్ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఆమె తండ్రి బోని కపూర్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ రోజున డబుల్ ధమాకా!
మార్చి 27న రామ్చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కు గ్రాండ్ ట్రీట్ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్ బర్త్డే రోజున ఓ అప్డేట్ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్ యూనిట్ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ లభించనుంది.