విస్టెక్స్ (Vistex) వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్షా (Sanjay Shah) దుర్మరణం చెందారు. సంస్థ ఉద్యోగులతో కలిసి కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని హైదరాబాద్ వచ్చిన ఆయన సంబురాలు చేసుకుంటుండగానే మృతిచెందారు. నగర శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విస్టెక్స్ సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్రాజ్ కూడా తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు.
ముంబైకి చెందిన సంజయ్షా 25 ఏళ్ల కిందట విస్టెక్స్ ఏషియా (Vistex Asia) కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ అంచెలంచెలుగా దేశవిదేశాలకు విస్తరించింది. ఈ సందర్భంగా సిల్వర్ జూ బ్లీ వేడుకలు నిర్వహించేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఈవో సంజయ్షాతో పాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న దాదాపు 700 మంది హాజరయ్యారు.
అయితే వేడుకల ప్రారంభం సందర్భంగా సంజయ్షా ఎంట్రీ కోసం ఏరియల్ యాక్ట్ సిద్ధం చేశారు. 20 ఫీట్ల ఎత్తు నుంచి క్రేన్ లాంటి(రోప్ వే) యంత్రం నుంచి సంజయ్ షా, సంస్థ ప్రెసిడెంట్ విశ్వనాథ్రాజ్ కిందకి దిగుతుండగా క్రేన్ ఇనుప తీగలు తెగిపోయాయి. దీంతో వారు కింద ఉన్న సిమెంట్ దిమ్మెలపై పడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత సంజయ్షా మృతి చెందారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న విశ్వనాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
సంజయ్ షా స్థాపించిన విస్టెక్స్ సంస్థలో దాదాపు 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన చికాగోలో స్థిరపడ్డారు. సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో మాతృదేశానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ను ఎంచుకొన్నారు. విదేశాల్లోని ఉన్నతోద్యోగులను ఈ ఈవెంట్కు ఆహ్వానించారు. సంజయ్ షా తన వ్యక్తిగత విమానంలో నేరుగా చికాగో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. ఉద్యోగులతో ఘనంగా సంబురాలు చేసుకొందామని ఆశించగా ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం శాపంగా మారింది. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో అబ్బుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.