• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2024: సంచలనాలు ఉన్నా.. ఐపీఎల్‌పై ఫ్యాన్స్‌లో అసంతృప్తి.. ఎందుకంటే?

    గత సీజన్లతో పోలిస్తే 17వ ఐపీఎల్‌ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. ముఖ్యంగా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ప్రతీ బంతిని స్టాండ్స్‌లోకి తరలిస్తూ క్రికెట్‌ ప్రియులకు అసలైన మజాను అందిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ నమోదైన టాప్‌-10 అత్యధిక స్కోర్లలో ఏనిమిది ఈ సీజన్‌లోనే వచ్చాయంటే ఏ స్థాయిలో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్‌ వరకూ అంతా బాగానే ఉన్నా మిగత విషయాల్లో మాత్రం ఈ సీజన్‌ ఐపీఎల్‌ ప్రియులను నిరాశ పరుస్తోంది. ఆశించిన స్థాయిలో మెప్పించలేక వారి అసంతృప్తికి కారణమవుతోంది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. 

    బ్యాట్‌ వర్సెస్‌ బాల్ ఎక్కడ?

    బంతికి బ్యాటుకు మధ్య రసవత్తరమైన పోరు ఉన్నప్పుడే ఏ మ్యాచ్‌పైన అయినా ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడుతుంది. బ్యాటు-బంతిలో ఏ ఒక్కటి అదిపత్యం చెలాయించినా మ్యాచ్‌ వన్‌సైడెడ్‌గా మారి ఇంట్రెస్ట్‌ సన్నగిల్లితుంది. ఈ ఐపీఎల్‌లో ప్రస్తుతం అదే జరుగుతోంది. బ్యాట్‌ వర్సెస్‌ బాల్‌ పోరులో బ్యాటుదే ఎల్లప్పుడూ పైచేయి అన్నట్లు మారిపోయింది. ఈ సీజన్‌లో 200+ స్కోరు సాధారణంగా మారిపోవడమే ఇందుకు కారణం. గత సీజన్‌లో బ్యాటింగ్‌ రికార్డ్స్‌తో పాటు హ్యాట్రిక్‌ వికెట్స్‌, 5 వికెట్స్‌ హాల్‌ వంటివి కనిపించేవి. కానీ, ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డులు తప్ప.. బౌలింగ్‌ పరంగా ఏ రికార్డు నమోదు కాలేదు. 

    సూపర్‌ ఓవర్లు మిస్సింగ్‌

    ఐపీఎల్‌లో గత సీజన్లు పరిశీలిస్తే సూపర్‌ ఓవర్లు, డబుల్‌ సూపర్‌ ఓవర్లు.. క్రికెట్‌ ప్రియులను అలరించేవి. ఈ ఏడాది సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తైన వాటి జాడే కనిపించలేదు. ఒకప్పుడు 140+ స్కోరును కూడా బౌలర్లు అద్భుతమైన బంతులు సంధించి కాపాడుకునేవారు. కానీ ఈ సీజన్‌లో 250+ ప్లస్ స్కోర్‌ చేసినా దానిని కాపాడుకుంటామన్న నమ్మకం బౌలర్లకు ఉండటం లేదు. ఉదాహరణకు ఇటీవల పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 262 పరుగులు చేసింది. దానిని ఛేజ్‌ చేసి పంజాబ్ బ్యాటర్లు ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ప్రపంచంలో ఏ టీ20 ఫార్మెట్‌లో అయినా ఇదే అత్యధిక రన్స్‌ ఛేజ్ విజయం. 

    ఆఖరి ఓవర్‌ విజయాలు

    గత సీజన్‌లో చాలా వరకూ మ్యాచులు.. ఫలితం కోసం చివరి ఓవర్‌ వరకూ వెళ్లేవి. ఆఖరి బంతికి ఫలితం వచ్చిన ఉత్కంఠ మ్యాచ్‌లను ఫ్యాన్స్‌ చూశారు. కానీ ఈ సీజన్‌లో అటువంటి మ్యాచ్‌ ఒక్కటి కూడా నమోదు కాలేదు. దాదాపు చాలా మ్యాచ్‌లు 18 ఓవర్ల లోపే రన్‌ ఛేజింగ్‌ పూర్తయిపోతోంది. లేదంటే వికెట్లు పడిపోయి.. ముందే విజయాలు ఖరారు అయిపోతున్నాయి. ఫలితంగా థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లపై ఆసక్తి కనబరిచేవారికి ఈ సీజన్‌ నిరాశ పరుస్తోంది. 

    ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానం

    గత సీజన్‌లో తీసుకొచ్చిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానం.. ఈ సీజన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానం ద్వారా అదనపు బ్యాటర్‌, బౌలర్‌ జట్లకు అందుబాటులో ఉంటున్నారు. పైగా మ్యాచ్‌లకు సిద్ధం చేస్తున్న పిచ్‌లు ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటం, అదనంగా ఒక బ్యాటర్ బరిలో దిగుతుండటంతో ధారళంగా పరుగులు వస్తున్నాయి. అదే సమయంలో బౌలర్లకు పిచ్‌ నుంచి సహకారం లేకపోవడంతో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బౌలర్‌ వచ్చినా జట్లకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. 

    వెనకబడ్డ స్టార్‌ జట్లు

    ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న జట్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), ముంబయి ఇండియన్స్‌ (MI), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు పేరుంది. ఆదివారం SRH vs CSK మ్యాచ్‌కు ముందు వరకు ఈ మూడు జట్లలో కనీసం ఒక్కటి కూడా టాప్‌-4లో లేదు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌తో పోలిస్తే తమ ఫేవరేట్‌ టీమ్స్‌ వెనకబడటం కూడా ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. అయితే ఆదివారం (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించి టాప్‌-3లోకి దూసుకు రావడం గమనార్హం. 

    బౌండరి లైన్‌ కుదింపు

    గత సీజన్లలో లేని విధంగా ఐపీఎల్‌ 2024లో బౌండరి లైన్‌ బాగా కుదించారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై సీనియర్‌ క్రికెటర్లు సైతం స్పందిస్తున్నారు. బౌండరీ లైన్‌ దగ్గరగా ఉండటం వల్ల ఈజీగా పరుగులు వస్తున్నట్లు క్రీడా నిపుణులు విమర్శిస్తున్నారు. ఇది బౌలర్లపై మరింత ఒత్తిడి పెంచి వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అంటున్నారు. దీని వల్ల వారు మరింత ప్రభావవంతంగా బంతులు వేయలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బౌండరి లైన్‌ను మరింత పెంచితే బాగుంటుందని ఐపీఎల్‌ నిర్వాహకులకు సూచిస్తున్నారు. 

    వివాదాలు లేక స్పైసీ తగ్గింది!

    ఒక్కప్పుడు క్రికెట్‌ అంటే కేవలం క్రికెట్‌ మాత్రమే చూసేవారు. కానీ, ఈరోజుల్లో క్రికెట్‌ అంటే ఫ్యాన్స్ కాస్త స్పైసీని కోరుకుంటున్నారు. గ్రౌండ్‌లో ప్లేయర్ల మధ్య వాగ్వాదం, ఆదిపత్య పోరును కోరుకుంటున్నారు. గత సీజన్‌లో విరాట్‌ vs నవీనుల్‌ హక్‌, విరాట్‌ vs గంభీర్‌ వివాదాలు ప్రేక్షకుల్లో ఎంత పెద్ద అటెన్షన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అటువంటి మసాలాను కోరుకునే వారికి ఈ ఐపీఎల్‌ కాస్త చప్పగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఎలాంటి వాగ్వాదాలు చోటుచేసుకోలేదు. ఒక ప్లేయర్‌ మరో ప్లేయర్‌ను స్లెడ్జ్‌ చేసిందీ లేదు. దీంతో కొందరు ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ను బోర్‌గా ఫీలవుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv