ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించడంపై కొంతమంది మాల్దీవుల (Maldives Row) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఖండిస్తున్నారు.
భారత్లోనూ మాల్దీవులకు మించిన ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఏర్పడిందని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు
ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని భారత పర్యాటకంపై మాట్లాడిన ఓ పాత వీడియో తాజాగా వైరల్ అవుతోంది. తన భార్యకు ట్రావెల్ అంటే ఇష్టమని.. ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాలకు వెళ్లే ముందు భారత్లో ఉన్న సుందరమైన ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నట్లు ధోని వీడియోలో అన్నాడు.
టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ షమి కూడా మాల్దీవులు, లక్షద్వీప్ వివాదంపై స్పందించాడు. ‘మనం మన పర్యాటకాన్ని ప్రోత్సహించాలి. దేశం ముందుకు వెళ్తే.. అందరికీ మంచి జరుగుతుంది. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి మద్దతు ఇవ్వాలి’ అని షమి పేర్కొన్నాడు.
అంతకుముందు బిగ్బీ అమితాబ్ బచ్చన్ కూడా మాల్దీవుల వివాదంపై స్పందించారు. తాను లక్షద్వీప్, అండమాన్లను చూశానని.. అవి అబ్బురపరిచే అందమైన ప్రదేశాలని కొనియాడారు. అద్భుతమైన బీచ్లు, నీటి అడుగున పొందే అనుభవం నమ్మశక్యం కానిదని చెప్పారు.
మాల్దీవుల మంత్రి చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఖండించారు. ‘పొరుగు వారితో స్నేహంగా మెలగాలని అనుకుంటాం. కానీ ద్వేషాన్ని మేమెందుకు సహించాలి? ఆత్మగౌరవమే ఫస్ట్. భారత దీవుల్లో అన్వేషిస్తూ మన పర్యటానికి మద్దతు తెలుపుదాం’ అంటూ అక్షయ్ పిలుపునిచ్చారు.
లక్షద్వీప్ వంటి అందమైన పరిశుభ్రమైన బీచ్లలో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుందని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. అవి మన దేశంలో ఉండటం చాలా విశేషమని ప్రశంసించాడు.
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం కూడా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మాట్లాడారు. ‘అతిథి దేవోభవ అనే సందేశంతో ఇచ్చే అద్భుతమైన భారతీయ ఆతిథ్యం, విస్తారమైన సముద్ర తీరం చూడాల్సిందే. ఇందుకోసం లక్షద్వీప్నకు వెళ్లాల్సిందే’ అని సూచించాడు.
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ సైతం లక్షద్వీప్ అందాలపై స్పందించారు. ‘లక్షద్వీప్లో సుందరమైన బీచ్లు, తీర ప్రాంతాలు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు. ఈ అద్భుతాలను వీక్షించేందుకు ఈ ఏడాది ప్లాన్ చేసుకుంటున్నా’ అని అన్నారు.
‘కొత్త అనుభూతిని ఇచ్చే దేశంలోని బీచ్లు, ఇతర సుందర ప్రదేశాలను సందర్శించి మన సంస్కృతిని ఆస్వాదించేలా ఈ ఏడాదిని ప్లాన్ చేసుకుందాం. భారత దీవులను అన్వేషిద్దాం.. రండి’ అని రణ్వీర్ సింగ్ పిలుపునిచ్చారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్