టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్స్ రాబట్టి ఎవరూ ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్లోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా డబుల్ గుడ్న్యూస్ ప్రకటించారు.
డబుల్ ధమాకా ఏంటంటే?
ఓటీటీ ప్రేక్షకుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ హనుమాన్ టీమ్.. డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ రూపంలో తెలియజేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మార్చి 16న ఓటీటీతో పాటు టెలివిజన్ ప్రీమియర్గానూ హనుమాన్ రానుంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ (Colors Cineplex) ఛానల్, ఓటీటీ వేదిక జియో సినిమా (Jio Cinema)లో హనుమాన్ ప్రసారం అవుతుందని డైరెక్టర్ తన పోస్టులో చెప్పుకొచ్చారు. అయితే ఇది కేవలం హిందీలో మాత్రమే టెలికాస్ట్ కావడం గమనార్హం. ఈ వివరాలను ముందుగా ‘కలర్స్ సినీప్లెక్స్’ సంస్థ తమ సోషల్ మీడియా ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) ఖాతాలో పోస్ట్ పెట్టింది. దానిని దర్శకుడు ప్రశాంత్ వర్మ రీట్వీట్ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది.
మరి తెలుగులో ఎప్పుడు?
హనుమాన్ చిత్రానికి సంబంధించిన తెలుగు స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee5) దక్కించుకుంది. మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్’ స్ట్రీమింగ్ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది. తర్వాత, మార్చి 8న శివరాత్రి సందర్భంగా హనుమాన్ను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ‘జీ5’ (Zee 5) సంస్థ ఖాతాను ట్యాగ్ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తాజా పోస్టులో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా తెలుగు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించకపోవడంతో తెలుగు ఆడియన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్ భరించాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రావొచ్చని సమాచారం.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2024/03/09105546/aa92130b5dcbb96bd933c40ae7d798e2-1.jpg)
తెలుగు రాష్ట్రాల్లో తగ్గని జోరు!
హనుమాన్ చిత్రం విడుదలై దాదాపు 2 నెలలు దాటినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా హనుమాన్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హనుమాన్ థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటింగ్ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆసక్తిక ట్వీట్ సైతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్’ హౌస్ఫుల్ కావడం చూసి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.
సీక్వెల్లోనూ విలన్ అతడేనా?
ప్రస్తుతం ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో సూపర్ విలన్గా నటించిన ‘వినయ్ రాయ్’ (Vinay Roy) పార్ట్ 2లోనూ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియో మరింత బలపరుస్తోంది. ‘హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్’ అంటూ వినయ్ రాయ్కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ పోస్టు చేశారు. వినయ్ సినిమాలో మాదిరిగానే ఫేస్కు మాస్క్, బ్లాక్ డ్రెస్ ధరించి హోటల్ సిబ్బందికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎంజాయ్ చేస్తున్న నెటిజన్లు.. ‘జై హనుమాన్’లోనూ వినయ్ విలన్గా కనిపిస్తాడా? అనే డౌట్ను రెయిజ్ చేస్తున్నారు.