• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Puri Jagannath: సక్సెస్ కోసం ఈ డైరెక్టర్ వేచి చూడాల్సిందేనా?

    పూరీ జగన్నాథ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ని సృష్టించిన టార్చ్‌బేరర్. పడిలేచిన దర్శక కెరటం. ఇండస్ట్రీకి మైలు రాళ్లవంటి సినిమాలు అందించిన డైరెక్టర్. కానీ, పూరీ మార్క్ సినిమా చూడక చాలా ఏళ్లయింది. లైగర్‌తో వచ్చినా.. అది నిరాశే పరిచింది. దీంతో పూరీపై ఇండస్ట్రీలో నమ్మకం సడలుతోందని, తన మేకింగ్‌తో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాడని చర్చ నడుస్తోంది. అసలు పూరీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు నిలబడ లేకపోతున్నాయి? మార్పు ఎక్కడ వచ్చింది? మళ్లీ పూరీ బౌన్స్ బ్యాక్ కాగలడా? అనే అంశాలను ఈ కథనం ద్వారా పరిశీలిద్దాం.

    మేకింగ్ మారిందా..?

    ఇతర దర్శకులతో పోలిస్తే పూరీ మేకింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది. తన మాటలతో మాయ చేసేస్తాడు. పంచ్ డైలాగులతో పని పూర్తిచేస్తాడు. ఎక్కువగా సమయాన్ని వృథా చేయడు. కథ రాయడం దగ్గరి నుంచి విడుదల వరకు చకచకా ఐపోవాల్సిందే. అయితే, ఇదే వేగం.. కొన్నిసార్లు తొందరపాటుగా పరిణమిస్తోంది. అడపాదడపా సీన్లతో కానిచ్చేస్తున్నట్లు అనిపిస్తోంది. సినిమాలో కొన్ని పార్శ్వాలు మాత్రమే బలంగా కనిపిస్తున్నాయి. ఒక సినిమాలో పాత్రల చిత్రీకరణ ఆసక్తిగా ఉంటే.. మరో సినిమాలో ఎమోషనల్ సీన్లు పండుతున్నాయి. దీంతో మునపటితో పోలిస్తే పూరీ మేకింగ్ శైలి మారిందంటూ చర్చ నడుస్తోంది. అందుకే వరుస పరాజయాలు వెంటాడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    కథలో బలం లోపిస్తోందా..?

    పూరీ జగన్నాథ్ ఆడియెన్స్‌కి ఫుల్ మీల్స్ తినిపించి చాలా కాలం అవుతోంది. టెంపర్ తరువాత ఈ డైరెక్టర్‌కి సక్సెస్‌ని ఇచ్చిన చిత్రం మరొకటి లేదు. ఎన్టీఆర్‌తో మాస్ డైలాగులు చెప్పించి మెప్పించాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్టు దొరకలేదు. లైగర్ కోసం చాలా శ్రమించాడు. సమయం తీసుకున్నాడు. మంచి విజయం సాధిస్తుందనే పూరీ భావించాడు. కానీ అది కూడా బోల్తా కొట్టింది. టెంపర్ తర్వాత చేసిన ఏడు సినిమాల్లో కథను బలంగా చెప్పలేకపోయాడనేది పూరీపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే డైలాగులపై దృష్టి పెట్టాడేమో అన్నట్లు ఉంటోంది. ఇస్మార్ట్ శంకర్, మెహబూబా, రోగ్‌లలో.. కొన్ని డైలాగులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

    నమ్మకం పోయిందా..?

    వరుస ఫ్లాప్‌లతో పూరీపై హీరోలకు నమ్మకం పోయిందంటూ ప్రచారం జరుగుతోంది. లైగర్ ఫలితంపై అసంతృప్తితో విజయ్ జనగణమనకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్టు. గతంలో మహేశ్‌తో ఈ సినిమా తీయాలని పూరీ భావించాడు. కానీ కుదర్లేదు. ఇప్పుడు విజయ్ కూడా దూరం పెట్టడంతో ఏ నటుడూ ఈ డైరెక్టర్‌ని నమ్మే పరిస్థితుల్లో లేరన్న చర్చ నడుస్తోంది. కానీ తనదైన రోజున పూరీ మార్క్‌ సినిమాను రుచి చూపించగలడు. దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

    ఇండస్ట్రీ హిట్టు కొడతాడా..?

    పడిలేవడం పూరీకి సాధారణమని చాలామంది డైరెక్టర్లు చెబుతుంటారు. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా.. ఒక్క హిట్టుతో వాటన్నిటినీ పటాపంచలు చేస్తాడని అంటుంటారు. పోకిరీ సినిమాతో ఇది నిరూపితమైందని తాజాగా వి.వి.వినాయక్ స్పష్టం చేశాడు. ఇప్పుడు కూడా మరో బ్లాక్‌బస్టర్‌ తీసి అందరి నోళ్లూ మూయిస్తాడని ఘాటుగానే స్పందించాడు. ఒక వినాయక్ అనే కాదు.. చాలామంది దర్శకులు పూరీ డైరెక్షన్‌కి ఫిదా అయిపోతుంటారు. ఇడియట్, బద్రి సినిమాల్లోని కొన్ని సీన్లను ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. సో, ఓటమి నుంచి తేరుకుని.. పూరీ బలమైన కథని సిద్ధం చేస్తాడని ఇండస్ట్రీ ధీమాతో ఉంది. 

    ఈ పుట్టినరోజు(Sep 28) సందర్భంగా పూరీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తిరిగి పుంజుకోవాలని ఆశిద్దాం. త్వరలో మనందరికీ బిర్యానీ లాంటి హిట్టుని రుచి చూపించాలని కోరుకుందాం. HAPPY BIRTHDAY TO PURI JAGANNATH.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv