టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు.. తన తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీతో సత్సంబంధాలు లేవని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లోకేష్కు పోటీగా మారతాడన్న ఉద్దేశ్యంతో తారక్ను టీడీపీ దూరంగా పెడుతోందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ వైఖరితో అతడి మనసు నొచ్చుకుందని అందుకే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారాన్ని అప్పటి అధికార వైకాపా వినియోగించుకునే ప్రయత్నం కూడా చేసింది. ఆ పార్టీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారు తారక్కు మద్దతు ఇస్తూనే టీడీపీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. అయితే వీటన్నింటికి తారక్ ఒక్క ట్విట్తో పటాపంచలు చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తనదైన శైలిలో అభినందనలు చెప్పారు.
‘మామయ్యకు శుభాకాంక్షలు’
ఆంధ్రప్రదేశ్లో అసాధారణ విజయాన్ని అందుకున్న చంద్రబాబు (Chandra Babu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లకు.. జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్ కల్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కల్యాణ్రామ్ స్పెషల్ విషెస్
తారక్తో పాటు టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన హీరో నందమూరి కల్యాణ్రామ్ కూడా టీడీపీకి ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశాడు. ‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మామయ్యకీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్, శ్రీ భరత్, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.
కలిసిపోయినట్లేనా?
గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చిన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరూ చంద్రబాబుకు అభినందనలు తెలియజేయడంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు ఏమైనా ఉంటే ఇప్పటికైనా వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. తామంతా ఒక్కటే అన్న భావాన్ని కార్యకర్తలు, అభిమానుల్లో నింపాలని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తారక్ లేటెస్ట్ ట్వీట్ను టీడీపీ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. ఇకపై టీడీపీకి అన్ని మంచి రోజులేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున, రామ్చరణ్ ఏమన్నారంటే?
తారక్, కల్యాణ్ రామ్తో పాటు స్టార్ హీరోలు నాగార్జున, రామ్చరణ్లు సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్కల్యాణ్కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని నాగార్జున అన్నారు. అటు చరణ్.. ‘దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు’ అంటూ అభినందనలు తెలియజేశాడు.