• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2023: కొత్త కెప్టెన్లలో సత్తా చాటేదెవరు? టైటిల్‌ గెలిచే దమ్మున్నదెవరికి?

    మార్చి 31న IPL సమ్మర్‌ సందడి మొదలుకాబోతోంది. ఈ సారి చాలా జట్టు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. మరి అందులో కప్పు గెలిచే సత్తా ఉన్న కెప్టెన్లు ఎందరున్నారు? గతంలో వారు సాధించిన విజయాలేంటి ఓ సారి చూద్దాం.

    మార్క్రమ్‌- SRH

    ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా ఈసారి యాజమాన్యం మార్క్రమ్‌ను ఎంపిక చేసింది. 2016లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కప్పు అందించాడు. 2018లోనూ కేన్‌ విలియమ్సన్‌ జట్టును ఫైనల్‌ చేర్చాడు. కానీ ఈ సారి కేన్‌ను వదులుకున్న జట్టు.. మార్క్రమ్‌కు పగ్గాలు అప్పగించింది. మార్క్రమ్‌ ఇటీవల కాలంలో అదరగొడుతున్నాడు. సౌతాఫ్రికా జట్టుకు కూడా అతడు కెప్టెన్‌గా ఎదిగాడు. SA20 లీగ్‌లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా కప్పును కూడా అందించాడు. సన్‌రైజర్స్‌ జట్టు కూడా ఈ సారి బలంగానే కనిపిస్తోంది. అయితే సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ కారణంగా మార్క్రమ్‌ కొన్ని మ్యాచ్‌లు మిస్ కావొచ్చు. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి మరి.

    నితిశ్‌ రాణా- KKR

    శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా IPLకు దూరం కావడంతో KKR సంచలనంగా నితిశ్‌ రాణాను కెప్టెన్‌గా ఎంచుకుంది. దేశవాళీ క్రికెట్‌లో దిల్లీ జట్టుకు కెప్టెన్‌గా చేసిన అనుభవం నితీశ్‌ రాణా సొంతం. మరి అంతర్జాతీయ ఆటగాళ్లతో ఏ మేరకు సమన్వయం చేసుకుని జట్టును నడిపించగలడో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

    డేవిడ్‌ వార్నర్‌-DC

    తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ దూరం కావడంతో ఈ సారి దిల్లీ డేవిడ్‌ వార్నర్‌కు కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించింది. వార్నర్‌ ఇప్పటికే సన్‌రైజర్స్‌కు కప్పు అందించిన అనుభవమున్నవాడు. 69 మ్యాచుల్లో 35 విజయాలు వార్నర్ పేరు మీద ఉన్నాయి. మరి దిల్లీ జట్టుతో కప్పు కొట్టగలడో లేదో వేచి చూడాలి.

    రోహిత్‌- MI

    రోహిత్‌ కెప్టెన్సీ గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. IPLలో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. 2013 నుంచి ముంబయి జట్టుకు సారథ్యం వహిస్తూ 5 టైటిళ్లు గెలిచాడు. ఆ జట్టుకు 143 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన రోహిత్‌ శర్మ 79 మ్యాచ్‌లు గెలిపించాడు. ముంబయి జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. టోర్నీకి ముందు ఫామ్‌లో లేని ఆటగాళ్లు కూడా ముంబయికి అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముంబయి ఎప్పటికీ టైటిల్‌ ఫేవరెట్లలో ఉంటుంది. 

    MS ధోనీ- చెన్నై

    IPLలో మరో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ ధోని. గతేడాది చెన్నై కెప్టెన్సీని వదులుకుందామనుకున్నా…జడేజా తప్పుకోవడంతో మళ్లీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. 2008 నుంచి చెన్నైకి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 210 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ధోనీ 123 మ్యాచ్‌లు గెలిపించాడు. 4 టైటిళ్లు అందించాడు. ఈ సారి జట్టు అంత బలంగా కనిపించడం లేదు కానీ ధోనీ కెప్టెన్సీతో మ్యాజిక్ చేయగల సత్తా ఉన్నవాడు.

    డుప్లెసిస్‌-RCB

    గత సీజన్‌లోనే బెంగళూరు డుప్లెసిస్‌ను తమ కెప్టెన్‌గా చేసుకుంది. గతేడాది 16లో 9 మ్యాచ్‌లు గెలిపించాడు. ప్లేఆఫ్స్‌కు జట్టును తీసుకెళ్లగలిగాడు. కానీ ఆర్సీబీ ఐపీఎల్‌లో దురదృష్టకర జట్లలో ఒకటిగా ఉంది. 3 సార్లు ఫైనల్‌ దాకా చేరినా కప్పు గెలవలేకపోయింది. ఈ సారి డుప్లెసిస్‌ వారి ఫేట్‌ మారుస్తాడేమో చూడాలి. డుప్లెసిస్‌ స్ట్రాటజీస్‌లోనే గాక ప్లేయర్ల సమన్వయం, జట్టులో స్నేహపూరతి సంస్కృతిని తీసుకురావడంలో పేరున్నవాడు. 

    హార్దిక్‌ పాండ్యా-GT

    గతేడాదే కొత్తగా వచ్చినా… తొలి సీజన్‌లో కప్పు కొట్టిన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. హార్దిక్‌ పాండ్యాకు విజయాలు సాధించే ఏదో మెలిక తెలుసనుకుంటా. గత సీజన్‌లో ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గుజరాత్‌ గెలవగలగింది. ఎవరో ఒక ఆటగాడు అదరగొట్టి మ్యాచ్‌ను గెలిపించారు. ఈ సారి టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా గుజరాత్‌ దిగుతోంది. గతేడాది గుజరాత్‌ 15 మ్యాచ్‌లు ఆడితే ఏకంగా 11 మ్యాచుల్లో హార్దిక్‌ పాండ్యా జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లాడు.

    KL రాహుల్‌-LSG

    గత సీజన్‌లో వచ్చిన మరో కొత్త జట్టు లక్నో సూపర్‌ జయంట్స్‌. LSGకి కెప్టెన్‌గా మారిన రాహుల్‌ అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌కు సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. అయితే అక్కడ అతడికి అదృష్టం అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. సులభంగా గెలవాల్సిన చాలా మ్యాచ్‌లు రాహుల్‌ సారథ్యంలో ఓడిపోయారు. ఇప్పటిదాకా రాహుల్‌ 42 మ్యాచ్‌లకు సారథ్యం వహిస్తే అందులో సూపర్‌ ఓవర్ మ్యాచ్‌లు మినహా 20 మ్యాచుల్లో విజయం సాధించి.. 20 మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. కానీ గతేడాది లక్నో జట్టును రాహుల్‌ ప్లేఆఫ్స్‌కు చేర్చగలిగాడు. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో జట్టు సమాయత్తమవుతోంది.

    సంజూ శాంసన్‌-RR

    2021 నుంచి సంజూ శాంసన్‌ రాజస్థాన్‌ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది జట్టును ప్లేఆఫ్స్‌కు కూడా తీసుకెళ్లాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానలో రాజస్థాన్‌ నిలిచింది. ఇందులో జోస్‌ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. అయితే కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఇప్పటిదాకా 31 మ్యాచుల్లో 15 విజయాలు నమోదు చేశాడు. ఈ సారి మరి RRను ఎంత బాగా నడిపిస్తాడో చూడాలి.

    శిఖర్ ధావన్‌-PBKS

    పంజాబ్‌ కింగ్స్‌ కూడా ఈ సారి తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంచుకుంది. టీమిండియా సీనియర్‌ ప్లేయర్‌ శిఖర్‌ ధావన్‌ను ఎంచుకుంది. ఆటగాడిగా ధావన్‌ IPLలో సక్సెస్‌ఫుల్‌ బ్యాటర్‌. కెప్టెన్సీ పరంగా ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లకు (2014లో సన్‌రైజర్స్‌కు) సారథ్యం వహించాడు. అందులో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే విజయం దిశగా సాగాయి. అయితే పలుమార్లు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ధావన్‌ సారథిగా విజయం సాధించాడు. మరి ఈ సారి పంజాబ్‌ను ఏ మేరకు విజయ తీరాలకు చేర్చగలడో చూడాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv