• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Scenic Roads: తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సుందరమైన రోడ్డు మార్గాలు.. వెళ్లారంటే ఫిదా కావాల్సిందే..!

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, ప్రసిద్ద దేవాలయాలు, అటవీ ప్రాంతాలు ఇలా ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే రోడ్లు సైతం ఎంతో సుందరమైన ప్రకృతిని పరిచయం చేస్తుంటాయి. ఆ రోడ్లలో ప్రయాణించడం ద్వారా పర్యాటకులు, వాహనదారులు ఎన్నో మధురానుభూతులను పొందుతుంటారు. అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఏపీ, తెలంగాణలలో అందమైన మార్గాలు ఎన్ని ఉన్నాయి? సరిగ్గా ఏ ఏ మార్గాల్లో ప్రయాణిస్తే మంచి అనుభూతిని పొందొచ్చు? అని ఆలోచిస్తున్నారా. అయితే ఇది మీకోసమే.. 

    1. మారేడుమిల్లి To అరకు

    ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ అందమైన మార్గం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి గ్రామం నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన అరకు వరకు ఉన్న ఈ రోడ్డు మార్గం భూతల స్వర్గమని చెప్పొచ్చు. పచ్చటి ప్రకృతి రమణీయత మధ్య సాగే ఈ ప్రయాణం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. దట్టమైన అడవులను దారిపొడవున మిమ్మల్ని పలకరిస్తాయి. పక్షుల కిలకిలారావాలు మీ చెవిలో మార్మోగుతుంటాయి. ప్రకృతి ఓడిలో ప్రయాణాన్ని కోరుకునేవారికి ఈ మార్గం మెుదటి ఛాయిస్‌.

    2. తిరుమల ఘాట్ రోడ్డు

    ఏపీలోని అత్యంత అందమైన రోడ్డు మార్గాల్లో తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డు ఒకటి. 19 కిలోమీటర్లు పొడవైన ఈ ఘాట్‌రోడ్‌లో ప్రయాణం.. గొప్ప అనుభూతిని పంచుతుంది. ఘాట్‌ రోడ్డు మలుపులు, ప్రకృతి వనాలు.. ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు ఈ ఘాట్‌ రోడ్డులో ప్రయాణాన్ని అమితంగా ఇష్టపడతారు. 

    3. వైజాగ్‌ బీచ్‌ రోడ్డు

    ఏపీలోని వైజాగ్‌ నగరం అత్యంత అందమైన సిటీగా గుర్తింపు పొందింది. సముద్ర తీరాన ఉన్న ఈ నగరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అయితే వైజాగ్‌ పేరు చెప్పగానే ముందుగా బీచ్‌ను అనుకొని ఉన్న రోడ్డే గుర్తుకు వస్తుంది. సినిమాల్లోనూ వైజాగ్‌ సిటీని చూపించాలంటే ముందుగా ఈ మార్గాన్నే చూపిస్తారు. సముద్రంలో నుంచి వచ్చే చల్లటి గాలులతో ఈ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు ఎంతగానో నచ్చుతుంది. 

    4. రాజమహేంద్రవరం బ్రిడ్జ్‌

    రాజమండ్రి పేరు చెప్పగానే ముందుగా గోదావరిపై నిర్మించిన భారీ వంతెనే గుర్తుకు వస్తుంది. రాజమహేంద్రవరం-కొవ్వూరు ప్రాంతాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. ఈ వంతెన పర్యాటకంగానూ ఎంతో ప్రసిద్ధి. గలగల పారే గోదారమ్మ తల్లిని చూస్తూ సాగే ఈ ప్రయాణం ప్రతీ ఒక్కరికీ తప్పక నచ్చుతుంది. 

    5. హైదరాబాద్‌ To  శ్రీశైలం 

    తెలంగాణలోని అందమైన రోడ్డు మార్గాల్లో హైదరాబాద్‌-శ్రీశైలం రోడ్డు ముందు వరుసలో ఉంటుంది. నల్లమల్ల ఫారెస్టు గుండా సాగే ఈ ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. సుమారు 70 కి.మీ మేర అడవీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎటు చూసిన చెట్లు.. అందమైన పక్షులతో ఈ మార్గం అత్యంత సుందరంగా ఉంటుంది. ఫ్యామిలీతో సరదాగా ట్రిప్‌ వెళ్లాలనుకునేవారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. పైగా శీశైలం మల్లన్న దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. 

    6. హైదరాబాద్‌ To వికారాబాద్‌

    హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌కు వెళ్లే రోడ్డు మార్గం ఎంతో సుందరంగా ఉంటుంది. దట్టమైన అడవులు, కొండలు-గుట్టలు, అందమైన గ్రామాలు ఈ మార్గంలో పలకరిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మార్గం గుండా ప్రయాణిస్తే జీవితంలో మర్చిపోరు. 

    7. వరంగల్‌ To ములుగు

    వరంగల్‌ నుంచి మలుగు వరకూ రోడ్డు ప్రయాణం గిరిజన ప్రాంతాలను పరిచయం చేస్తుంది. ఈ మార్గంలో పురాతన నిర్మాణాలు, జలపాతాలు, దట్టమైన అడవులు చూడొచ్చు. ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఈ మార్గంలోనే దర్శనమిస్తుంది. అలాగే సమ్మక్క-సారలమ్మ ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు.  

    8. నాగార్జునసాగర్‌ రోడ్డు

    హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరకూ ఉన్న రోడ్డుమార్గం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరు ప్రసిద్ధ కట్టడం నాగార్జున సాగర్‌ డ్యామ్‌ చూడొచ్చు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది మీ మనసుకు ఎంతో అహ్లాదాన్ని పంచుతుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv