• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!

    కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    బట్టల సత్తి (Battala Satti)

    టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్‌ బట్టల సత్తి ఒకరు. 1972లో ‘తులసి’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత ‘మంచు పల్లకి’, ‘అన్వేషణ’లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా చేసిన ‘లేడీస్‌ ట్రైలర్‌’ సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ‘బట్టల సత్తి’ పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది. 

    శుభలేఖ సుధాకర్‌ (Subhalekha Sudhakar)

    విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్‌ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్‌ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.

    రామిరెడ్డి (Spot Nana Rami Reddy)

    కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్‌ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్‌ హీరోగా చేసిన ‌’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్‌ పెడతా’ అనే డైలాగ్‌ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్‌ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. 

    సుత్తి వీరభద్రరావు  (Sutti Veerabhadra Rao)

    సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్‌ అయ్యింది. 

    సుత్తివేలు (Suthivelu)

    అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు ‘సుత్తివేలు’గా మారిపోయింది. 

    షావుకారు జానకి (Shavukaru janaki)

    షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. 

    సాక్షి రంగారావు (Sakshi Ranga rao)

    ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన  ‘సాక్షి’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు  800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు. 

    అల్లరి నరేష్‌ (Allari Naresh)

    ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్‌.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్‌ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్‌ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్‌’గా నరేష్‌ గుర్తింపు పొందాడు. 

    వందేమాతరం శ్రీనివాస్‌ (Vandemataram Srinivas)

    టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్‌’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో ‘వందేమాతర గీతం వరసమారుతున్నది’ పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది. 

    సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)

    టాలీవుడ్‌ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.

    మహర్షి రాఘవ (Maharshi Raghava)

    వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

    దిల్‌ రాజు (Dil Raju)

    ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్‌ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన ‘దిల్‌’ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్‌ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు. 

    వెన్నెల కిషోర్‌ (Vennela Kishore)

    నటుడు వెన్నెల కిషోర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్‌.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ‘వెన్నెల 1 1/2’ చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం. 

    సత్యం రాజేష్‌ (Satyam Rajesh)

    నటుడు సత్యం రాజేష్‌ అసలు పేరు.. రాజేష్‌ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్‌.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్‌ పాత్రల్లో కనిపించి సాలిడ్‌ విజయాలను అందుకున్నాడు.

    చిత్రం శ్రీను (Chithram Srinu)

    చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. ‘చిత్రం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

    బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu bhaskar)

    డైరెక్టర్ భాస్కర్‌.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్‌ డూపర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్‌’తో హ్యాట్రిక్‌ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్‌’ చిత్రానికి హారిస్‌ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.

    ఆహుతి ప్రసాద్‌ (Ahuti Prasad)

    నటుడు ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం  ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్‌ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్‌ బారిన పడి  జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.  

    జేడీ చక్రవర్తి (JD Chakravarthy)

    హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు  నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు. 

    బొమ్మాళి రవి శంకర్‌ (Bommali Ravi Shankar)

    తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్‌ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్‌ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన ‘అరుంధతి’  చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన రవిశంకర్‌.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్‌ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్‌ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు. 

    దేవి శ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad)

    టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్‌ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్‌ తన పేరులో కలుపుకున్నాడు.

    బాహుబలి ప్రభాకర్‌ (Bahubali Prabhakar)

    ‘రైట్‌ రైట్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్‌.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్‌ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు. 

    ప్రభాస్‌ శ్రీను (Prabhas Srinu)

    పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్‌ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్‌ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రానికి గాను ప్రభాస్‌ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv