భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. దీంతో హీరోయిన్లు ఒకే ఇండస్ట్రీకే పరిమితం కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్కు చెందిన కొందరు స్టార్ హీరోయిన్లు బాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో హిందీ, కన్నడ ఇండస్ట్రీకి చెందిన కథానాయికలు తెలుగులో తమ ముద్ర వేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఒక్క సినిమా రిలీజ్ కాకముందే ఆ భామలకు మల్టిపుల్ ఆఫర్లు రావడం విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? వారు ఓకే చేసిన ప్రాజెక్టులు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సాయిపల్లవి (Sai Pallavi)
సౌత్ స్టార్ సాయిపల్లవి.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్గా మారింది. ఇప్పుడామె హిందీ చిత్రసీమకు తన ప్రతిభను రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అమిర్ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా చేస్తోన్న చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘రామాయణం’ (Ramayanam)లోనూ భాగస్వామ్యమైంది. ఇందులో సీతగా సాయిపల్లవి కనిపించనుంది.
కీర్తి సురేశ్ (Keerthy Suresh)
దక్షిణాది స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించిన కీర్తి సురేష్ (Keerthy Suresh) సైతం బాలీవుడ్లో పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ఆమె ఇప్పటికే వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి ‘బేబీ జాన్’ (Baby Jaan) సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ పూర్తి కాకముందే మరో ప్రాజెక్ట్కు కీర్తి శ్రీకారం చుట్టింది. ‘అక్క’ (Akka Series)పేరుతో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఆ సిరీస్లో కీర్తి సురేష్తో పాటు రాధికా ఆప్టే కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
శ్రీలీల (Sreeleela)
‘పెళ్లి సందడి’ (Pelli SandaD)తో తెలుగు తెరపైకి అడుగు పెట్టిన శ్రీలీల వరుసగా చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఎక్కువ సినిమాలు ఫ్లాప్గా నిలవడంతో ఈ అమ్మడు ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్పై పడింది. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కనున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా శ్రీలీల ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదింకా చిత్రీకరణ ప్రారంభించుకోక ముందే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రం కోసమూ శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ (Telusu Kada) సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మరో తెలుగు ప్రాజెక్ట్ను సైతం అందిపుచ్చుకున్నట్లు సమాచారం. రానా (Daggubati Rana) కథానాయకుడిగా ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీనిధి కథానాయికగా చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి తెలుగులో ఈ అమ్మడు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఇప్పుడా అమ్మడు ఎన్టీఆర్ ‘దేవర’ (Devara)తో తెలుగులో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబరు 27న థియేటర్లలోకి రానుంది. ఈలోపే జాన్వీ తెలుగులో రెండో అవకాశాన్నీ దక్కించుకుంది. ఈసారి తను కథానాయకుడు రామ్చరణ్కు జోడీగా అలరించనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే జాన్వీ తెలుగులోనూ బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)
బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)తో తెలుగు తెరపై కాలుమోపేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా తెరపైకి రాకముందే భాగ్యశ్రీ మరో రెండు టాలీవుడ్ ప్రాజెక్ట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తోంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ చేయనున్న కొత్త తెలుగు సినిమాలోనూ నాయికగా నటించే అవకాశం దక్కించికున్నట్లు తెలుస్తోంది.