• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KTR as CM: వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కేటీఆర్… వ్యూహం మార్చిన కేసీఆర్!

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయం వేడెక్కింది. అధికార, విపక్షాలు ఎన్నికల సమరానికి మెల్లిమెల్లిగా రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో క్యాడర్ బలోపేతంపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయి. మరోవైపు, ఇదే ఊపును కొనసాగించాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అయితే, బీఆర్ఎస్‌లో సీఎం అభ్యర్థిత్వంపై తరచూ చర్చ జరుగుతూ వస్తోంది. సీఎం కేసీఆరే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కొందరు చెబుతుండగా, ఇతర నాయకులు, కొందరు మంత్రులు మాత్రం కేటీఆర్ పేరు వల్లిస్తున్నారు. 

    మంత్రి పువ్వాడ కామెంట్స్..

    రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ తదుపరి సీఎం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్‌లో ప్రస్తుత సీఎం, కాబోయే సీఎం.. ఇద్దరూ రెడీగా ఉన్నారు. మరి, ప్రతిపక్షాల సీఎం అభ్యర్థి ఎవరంటే ఏం చెబుతారు?’ అంటూ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల సంగతి పక్కన పెట్టి మంత్రి వ్యాఖ్యల్ని లోతుగా అర్థం చేసుకుంటే తదుపరి సీఎం కేటీఆర్ కావొచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా వీటికి బలం చేకూరుస్తుండటం గమనార్హం. 

    జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్

    గతేడాది నుంచి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. మహారాష్ట్ర, ఢిల్లీల్లో వరుసగా పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అక్కడి పట్టణాల్లో తరచూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ‘ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అక్కడి నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం, క్షేత్ర స్థాయిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం వంటి ఘటనలను పరిశీలించి చూస్తే ఈ వాదన నిజమేనని అనిపించక మానదు. 

    ఎంపీగా పోటీ..?

    సీఎం కేసీఆర్ మరోసారి ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామని చూస్తున్నట్లు తెలుస్తోంది. కిందటి సారి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ కేవలం 9 సీట్లను మాత్రమే గెల్చుకుంది. 4 సీట్లు బీజేపీ, 3 కాంగ్రెస్, మరొక చోట ఎంఐఎం ఎంపీ స్థానాన్ని దక్కించుకున్నాయి. దీంతో స్వయంగా ఎంపీ ఎన్నికలకు బరిలో దిగి తెలంగాణలోని 17 స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుపొందాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 

    విపక్షాల ఐక్యత..

    గతంలో కేసీఆర్ గల్వాన్ లోయలో జరిగిన కాల్పుల్లో మరణించిన జవాన్లకు ఆర్థిక సాయం ప్రకటించారు. పంజాబ్ రైతులకు ఆర్థిక బాసట కల్పించారు. విపక్షాలను ఐక్యం చేసేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్, పశ్చిమబెంగాల్, బిహార్ సీఎంలను కలిశారు. యూపీ, కర్ణాటకలోని విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఇలా క్రమంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో జేడీ(ఎస్)కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.

    కేసీఆరే ముఖ్యమంత్రి..!

    ఏనాటికైనా కేటీఆరే ముఖ్యమంత్రి అనే విషయంలో పూర్తి స్పష్టత నెలకొంది. అయితే, ఈ ఏడాది జరిగే ఎన్నికలకు కేసీఆరే సీఎం అభ్యర్థి అంటూ కేటీఆర్ గతంలోనే వెల్లడించారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక… సీఎం పదవి కేటీఆర్‌కు అప్పగిచ్చే అవకాశం లేకపోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే విపక్షాలను గందరగోళం సృష్టిస్తూ.. బీఆర్ఎస్ నేతల్లో గందరగోళం నెలకొనకుండా.. కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv