సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్ రోల్ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్ దర్శకులు హీరోతో పాటు విలన్ క్యారెక్టర్ డిజైన్పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్ అయ్యిందంటే ఆటోమేటిక్గా హీరోకి ఎలివేషన్ లభించి సినిమా హిట్ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
భిక్షు యాదవ్ (Sye)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్ పాత్ర కంటే.. విలన్ బిక్షు యాదవ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్ రావత్ (Pradeep Rawat) తన లుక్తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్ తగిలించుకొని నిజమైన విలన్గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్ రావత్ కెరీర్ను మలుపుతిప్పింది.
అలీభాయ్ (Pokiri)
పోకిరిలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన అలీభాయ్ పాత్ర. మాఫియా డాన్గా పవర్ఫుల్గా కనిపిస్తూనే ప్రకాష్ రాజ్ తనదైన డైలాగ్స్తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్ రాజ్ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.
భల్లాలదేవ (Baahubali)
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.
పశుపతి (Arundhati)
తెలుగులో అతి భయంకరమైన విలన్ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.
కాట్రాజ్ (Chatrapathi)
ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.
పండా (Gharshana)
ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్ (Venkatesh) చాలా పవర్ఫుల్గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్స్టర్ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.
మద్దాలి శివారెడ్డి (Race Gurram)
రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్. అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.
వైరం ధనుష్ (Sarrainodu)
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్ పాత్రలో చాలా క్రూయల్గా చేశాడు.
భవాని (Siva)
శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్ అవసరం లేదని దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్ (Raghuvaran) స్టార్ విలన్గా మారిపోయాడు.
బుక్కా రెడ్డి (Rakta Charitra)
రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్కు లోనవుతారు.
అమ్రీష్ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari)
చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్ నటన మెప్పిస్తుంది.
రణదేవ్ బిల్లా (Magadheera)
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్ రణదేవ్ బిల్లాకు స్క్రీన్ షేరింగ్ ఉంటుంది. దేవ్ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.
మంగళం శ్రీను (Pushpa)
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రంలో.. నటుడు సునీల్ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్ను విలన్గా చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్, నటన ఎంతగానో ఆకట్టుకుంది.